మాజీ సీఐడీ చీఫ్పై రఘురామకృష్ణరాజు తీవ్ర ఆగ్రహం.. కారణం ఇదే!
- ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్పై రఘురామ ఆగ్రహం
- తనపై అసత్య ఆరోపణలు చేశారని మండిపాటు
- హింసను ప్రేరేపించే వారిపై చర్యలు తీసుకోవడాన్ని ప్రభుత్వానికే వదిలేస్తున్నానని వ్యాఖ్య
సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్పై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భీమవరంలో జరిగిన ఒక సమావేశంలో సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు తక్షణమే విచారణ చేపట్టాలని అన్నారు. తానే స్వయంగా 4,000 ఎస్సీ, ఎస్టీ కేసులపై ఛార్జిషీటు వేయించానని సునీల్ కుమార్ మాట్లాడటంపై రఘురామ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీ సీఐడీకీ, సాధారణ ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసులకు ఎలాంటి సంబంధం ఉండదని... అత్యంత సంచలనమైన కేసులు ఉంటే తప్ప, సీఐడీ పరిధిలోకి 200 కేసులకు మించి తీసుకోవడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు.
అలాంటిది 4,000 కేసుల్లో ఛార్జిషీటు వేయించానని సునీల్ కుమార్ బరితెగించి మాట్లాడటం చూస్తుంటే, గతంలో జరిగిన తన కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయన పాత్ర ఉందనే విషయం క్లియర్గా అర్థమవుతోందని రఘురామకృష్ణరాజు విమర్శించారు. అసలు ఛార్జిషీట్లు వేయించడంలో ఆయనకున్న సంబంధం ఏంటో పోలీసులు తేల్చాలన్నారు. అలాగే ఆ సమావేశంలో ఢిల్లీ నుంచి వచ్చిన జాన్మార్క్ అనే వ్యక్తి.. ‘వాళ్లను వేసేయాలి, వీళ్లను వేసేయాలి’ అంటూ హింసను ప్రేరేపించేలా పిచ్చిపిచ్చిగా మాట్లాడారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మంచి ప్రభుత్వం ఉన్న వేళ, ఇలా హింసను ప్రేరేపిస్తూ మాట్లాడే వారిపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది కూటమి ప్రభుత్వ విచక్షణకే వదిలేస్తున్నానని రఘురామ పేర్కొన్నారు.